by Suryaa Desk | Mon, Sep 09, 2024, 07:46 PM
తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతలో రూ. లక్ష వరకు, రెండో విడతలో రూ.లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. కాగా.. రైతు రుణమాఫీపై తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ పంట కాలంలోనే రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా ఐదేళ్లు పాటు కాలయాపన చేయబోమని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటిసారి రూ.లక్ష రుణమాఫీకి 4 వాయిదాలు తీసుకున్నారని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు. రెండోసారి ఐదేళ్ల కాలంలో సగం మంది అన్నదాతలకే మాఫీ అమలు చేశారన్నారు. 20.84 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. అందులోనూ 2.26 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.1,419 కోట్లు జమకాక తిరిగి ప్రభుత్వ ఖజానాకు మళ్లించారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సరైన వివరాలు ఉన్న అన్నదాతల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ చేశామని అన్నారు.
మొదటి పంటకాలంలోనే 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు ఒకే విడతలో నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. కొందరికి సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కాలేదని.. వారికి కూడా మాఫీ వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ పంట కాలంలోనే వారందరికీ రుణమాఫీ వర్తింప జేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఇక రైతుభరోసాపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పథకం అమలుపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని అన్నారు. రైతుబంధు అమలు విషయంలో ప్రజలకు అపోహ ఉందని.. అందుకే పంట సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికే ఈ పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వానికి 10 నెలలు గడవకముందే ప్రతిపక్ష నేతలు విషప్రచారానికి తెరతీశారని.. అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని వెల్లడించారు. తాము అధికారలోకి వచ్చిన గత 9 నెలల కాలంలోనే రూ.26,140 కోట్లు అన్నదాతల సంక్షేమానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపడిన యాసంగి రైతుబంధు, ఆయిల్పామ్ రైతులకు ప్రోత్సాహకాలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ, డ్రిప్ కంపెనీలకు సబ్సిడీలు చెల్లించినట్లు చెప్పారు.