|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:12 PM
టెక్నాలజీ రంగంలో భారత్ మరో వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థను సురక్షితం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన 'పాక్స్ సిలికా' కూటమిలో భారత్ అధికారికంగా సభ్యదేశంగా చేరింది. శుక్రవారం నాడు ఈ చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.'సిలికాన్ ద్వారా శాంతి' అనే అర్థం వచ్చేలా ఈ కూటమికి 'పాక్స్ సిలికా' అని పేరు పెట్టారు. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన సిలికా ఆధారిత సాంకేతికతతో ప్రపంచ ఆర్థిక భద్రతను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఈ కూటమి ప్రారంభమైనప్పటికీ, తాజాగా భారత్ చేరికతో దీనికి మరింత బలం చేకూరినట్లయింది.ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్, అపారమైన సాఫ్ట్వేర్ నైపుణ్యం కలిగిన భారత్ను చేర్చుకోవడం ఈ కూటమికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. ముఖ్యంగా, టెక్నాలజీ తయారీ రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, భారత్ను ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ఇటీవల భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను తగ్గించిన నేపథ్యంలో ఈ పరిణామం ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని మరింత బలపరిచింది.