|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 12:50 PM
పటాన్చెరు : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రామేశ్వరంబండ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రామేశ్వరంబండ పరిధిలోని నాలుగు వార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ విజయాన్ని అందించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయించడంతోపాటు నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు అంతిరెడ్డి, రమేష్, వంకదోత్ రమేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.