by Suryaa Desk | Wed, Aug 14, 2024, 02:39 PM
శంషాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక, తండ్రితో పాటు సమీప గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్తంది. అయితే ఆమెపై కన్నేసిన యజమాని(30) ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరువిప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. దాదాపు అయిదు నెలలు గడిచాక విషయం బయటకు పొక్కడంతో బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యురాలికి డబ్బిచ్చి గర్భస్రావం చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఎలాగూ తప్పు జరిగిందని.. ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పాడు. స్థానికంగా కొందరి జేబులు నింపి అనుకూలంగా మలచుకున్నాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు డబ్బులకు లొంగలేదు. శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.