|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 06:22 PM
ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ సర్కార్ 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులలకు ప్రాధాన్యం ఇస్తూ మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 'హెల్త్ మిషన్-100' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అయింది. టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల మెడికల్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిచటంతో పాటు పలు కార్యక్రమాలకు తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో రోగులకు కావాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించనున్నారు. .
కార్యక్రమంలో భాగంగా.. మార్చి 2 నుంచి 31 వరకు.. పీహెచ్సీలలో గైనకాలజీ, పిల్లల, కంటి, ఎముకలు, దంత వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారు. 33 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ప్రత్యేక వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నారు. రక్తహీనత, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, ఐరన్ మాత్రల పంపిణీ చేయనున్నారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు కంటి చూపు పరీక్షలు, పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి 15 వరకు క్యాన్సర్ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించటం, క్యాన్సర్ కేర్ పాలసీ, క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు, బాధితులకు వైద్య సేవలు, ఆరోగ్య మహిళ కింద క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, జిల్లా డే-కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవల మ్యాపింగ్ వంటివి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు మహిళలకు పరీక్షలు నిర్వహించి టీబీ కేసుల గుర్తింపు, చికిత్స, డెంగ్యూ, వడదెబ్బ, అతిసారం వంటి వ్యాధులపై స్క్రీనింగ్ చేస్తారు. హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠి, వనస్థలిపురం, కరీంనగర్, ఆసిఫాబాద్, నిజామాబాద్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వడదెబ్బ చికిత్స గదుల ఏర్పాటు చేస్తారు.
మే 16 నుంచి జూన్ 9 వరకు పట్టణ పీహెచ్సీలను పాలీ క్లినిక్స్గా అప్గ్రేడ్ చేయటంతో పాటు ఐటీడీఏ ప్రాంతాల్లో సికిల్సెల్, థలసీమియా స్క్రీనింగ్కు మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు. హీమోఫీలియాపై దృష్టి సారించి పాఠశాలలు, హాస్టల్స్లో ఆహార తనిఖీలు చేపట్టనున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచార విజయాల ప్రదర్శన, జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.