|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:42 PM
రామచంద్రాపురం : ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మన సొంతం అవుతుందని.. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన సొంత నిధులతో పదోతరగతి విద్యార్థుల కోసం తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదవ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని.. ఇలాంటి సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు.. ప్రణాళిక బద్ధంగా చదివేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపకరిస్తున్నాయని తెలిపారు.
చదువు అంటే కేవలం ర్యాంకులు ఒక్కటే కాదని.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు నైతిక విలువలు, మానసిక సామర్థ్యం, శారీరక ధారుడ్యం పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం మండల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంత నిధులతో నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో.. పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక రంగానికి అవసరమైన ఉద్యోగులను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వంతో చర్చించి పాలిటెక్నిక్ కళాశాల సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆధునిక వసతులతో అత్యాధునిక ల్యాబ్ సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారులు రాములు, సుధాకర్, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మధు, సీనియర్ నాయకులు రామచంద్రా రెడ్డి, నర్రా బిక్షపతి. ఐలేష్ యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు.