|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 12:03 PM
బొల్లారం :పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి మరింత సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో ఐటీసీ పరిశ్రమ సౌజన్యంతో పాఠశాలలకు కంప్యూటర్లు, బల్దియా పారిశుధ్యం కోసం ఆటోల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రి చక్ర సైకిళ్లను లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి, బొల్లారం డివిజన్ పరిధిలో పారిశుధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానికంగా ఏర్పాటుచేసిన పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని.. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిఐ రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఐటీసీ సంస్థ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.