|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 11:43 AM
కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హుటాహుటిన అక్కడికి హరీష్ రావు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైంది. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారింది2019లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాం.పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి 1 కోటీ 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారు.ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు.కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ గారు కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశం..హైదరాబాద్లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదా..వాటర్ వర్క్స్ HMWSSB కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా.. సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవతలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, వాటర్ వర్క్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా..ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారు.
సమాచార హక్కు చట్టం కింద నేనే స్వయంగా అడిగితే ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఇది. 10 ఎకరాలు ఇస్తే వాళ్లు 17 ఎకరాలు కబ్జా పెట్టారు. ఓపెన్ ఆక్షన్ వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవి. కానీ లోపల లోపల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు.హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ కు కిలోమీటరు లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు. కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారు. పక్కన ఉన్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కంకర కొనాలని, లేకపోతే అనుమతులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారు.అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారద పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కుని కూలుస్తావా..భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే నీ ధర్మమా.. తక్షణమే ఆ అక్రమ క్రషర్లను క్యాన్సిల్ చేయాలి.కనీసం నోటీసులు ఇవ్వకుండా నిన్న రాత్రి 11:30 గంటలకు వందలాది మంది పోలీసులు, ఎంఆర్వోలు వచ్చి ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తారా..
క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా..ఉదయం నేను ఇక్కడికి వస్తున్నానని తెలియగానే పోలీసులు, ఆర్ఐ, తహసీల్దార్ అందరూ పారిపోయారు.దొంగల్లా దాక్కోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది.. ఉదయం స్వాములు పూజలు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న పూజలను ఆపే హక్కు, ధైర్యం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు.. స్వామీజీ గారు వాగ్వాదానికి దిగాక అరగంట తర్వాత పూజకు అనుమతించారు.కేసీఆర్ ఆనవాళ్లని చెప్పి రైతుబంధు, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ చేసినావు.. ఇప్పుడు గుళ్లను కూడా వదులుతలేవు. దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు.. నీకేదో పోయేగాలం దాపురించింది, ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుంది.
క్యాబినెట్లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు దయచేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలి.లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడుకునే బాధ్యత మాదే. ఎంత దూరమైనా పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం.