|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 06:26 PM
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలో టీ పొడిని కల్తీ చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. తాజాగా.. నగరంలోని పలు హోటళ్లలో వినియోగదారులకు కల్తీ నెయ్యి వడ్డిస్తున్నట్లు ఫుడ్ సెఫ్టీ అధికారులు గుర్తించారు. గత నెల రోజుల వ్యవధిలో నగరంలోని మూడు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి ఘటనలు వెలుగు చూశాయి.
ఖైరతాబాద్ జోన్లోని ఐమాక్స్ వద్దనున్న ఓ ప్రముఖ హోటల్లో వినియోగిస్తోన్న నెయ్యి ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు. నాచారంలోని ఫుడ్ సెఫ్టీ ల్యాబ్లో నెయ్యి నమూనాలను పరీక్షించగా.. ఆ నెయ్యి 'అన్ సేఫ్'గా ఫలితం వెల్లడైందని అధికారులు తెలిపారు. సదరు హోటల్ యజమాని, నెయ్యి తయారీదారు నాచారం ల్యాబ్ రిపోర్టును సవాల్ చేయడంతో ఆయా నమూనాలను మరోసారి పరీక్ష కోసం మైసూర్లోని ల్యాబ్కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ నివేదికలోనూ అన్ సేఫ్ అని వస్తే తయారీ సంస్థపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.
మార్కెట్లో ప్రస్తుతం నెయ్యికి డిమాండ్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది కల్తీ వ్యాపారానికి తెరతీస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు, పామాయిల్, వనస్పతి నూనెలతో కొన్ని సంస్థలు కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని చాలా చోట్ల నాసిరకం, కల్తీ నెయ్యి పెద్దఎత్తున వినియోగంలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. నోరూరించే బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాల్లోనూ హోటళ్ల యజమానులు కల్తీ నెయ్యిని ఉపయోగిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బయట ఫుడ్ తిని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ కల్తీ నెయ్యిలో పామాయిల్, వనస్పతి నూనెలే కాకుండా ఇతర కొవ్వులు కలిసి ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కల్తీ నెయ్యి తీసుకోవటం వల్ల ప్రజలు దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, కడుపుమంట, పేగు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు ప్రజలు బయట తినకపోవటమే మంచిదని చెబుతున్నారు. ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.