|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:06 PM
నిర్మాత బన్నీ వాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ, రాబోయే ఐదేళ్లలో దాదాపు 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాదని బన్నీ వాస్ స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యాపార పద్ధతులను సరిదిద్దుకోవడం, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం వంటి వ్యవస్థాగత మార్పులు చేయకపోతే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. "ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది శాతం కాదు..." అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే... పెద్ద హీరోల సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుందని బన్నీవాస్ గుర్తుచేశారు.
Latest News