|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:44 PM
హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగరంలో మరో రెండు చెరువులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్ - ఉద్- దౌలా చెరువుతో పాటు.. కూకట్పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6న బమృకున్ - ఉద్ - దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో కూకట్పల్లి నల్ల చెరువును కూడా సీఎం రేవంత్ ప్రారంభించి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. మరో మూడు చెరువులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడత మరో 14 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తోంది.
పాతబస్తీకి మణిహరంగా నిజాం కాలం నాటి బమృకున్ - ఉద్- దౌలా చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జాలను తొలగించి ఊపిరిలూదింది. ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయిన చెరువును బతికించింది. నాటి కట్టలను మరింత పటిష్టం చేసి వాకింగ్ ట్రాక్ను నిర్మించింది. కట్టలపై ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయటంతో పాటు చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేదతీరే విధంగా నలువైపులా బెంచీలు నిర్మించారు. చెరువుకు మూడు వైపులా ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని.. దానిని పునరావృతం చేసేలా చుట్టూ ఔషధగుణాలున్న మెుక్కలతో పాటు చల్లటి నీడనిచ్చే చెట్లను నాటారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
ఇక నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయిన కూకట్పల్లి నల్ల చెరువులో పూడికను పూర్తిగా తొలగించారు. దీంతో చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును తిరిగి 30 ఎకరాలకు విస్తరించారు. హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. బుధవారం చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు నిండితే సులభంగా నీరు బయటకు వెళ్లేందుకు గతంలో ఉన్న ఔట్లెట్లను అభివృద్ధి చేశామని ఏవీ రంగనాథ్ వెల్లడించారు. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరు పైగా పాత్ వే అందుబాటులోకి వచ్చిందన్నారు. చెరువు ప్రస్తుతం పిక్నిక్ స్పాట్లా మారిందని.. ఆరోగ్య పరంగా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మల్టీ పర్పస్గా దీన్ని తయారు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.