|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:55 PM
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగు రోడ్డు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ చుట్టూ కేంద్రీకృతం కానుండటంతో అందుకనుగుణంగా ప్రణాళికలకు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ రావిర్యాల ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభయ్యాయి.
ఇదే కాకుండా బుద్వేల్ లేఅవుట్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కోస్గి వరకు మరో రేడియల్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బుద్వేల్ వద్ద దాదాపు రూ.400 కోట్లతో భారీ ఇంటర్ఛేంజ్, ట్రంపెట్ రోడ్డును నిర్మిస్తున్నారు. రాజేంద్రనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎయిర్పోర్టుతోపాటు ఇతర ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగించేలా ఈ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. రానున్న మూడేళ్లలో 3 నుంచి 4 రేడియల్ రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ సైతం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 80 లక్షల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఐటీ కారిడార్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ఔటర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్ హబ్లు ఇతరత్రా అన్ని రకాల కార్యకలాపాలు ఒకేచోట కేంద్రీకృతం అయ్యేలా ఇప్పటి నుంచే హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది.
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు అటు, ఇటు కిలోమీటర్ మేర గ్రోత్ కారిడార్గా పేర్కొంటున్నారు. అందులో భూ వినియోగ మార్పిడి, నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్ఎండీఏ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చెరువులు, వాగులు, జలవనరులు, అక్కడ ఉన్న గ్రీనరీని కాపాడేందుకు ఈ మాస్టర్ప్లాన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అడ్డగోలుగా రెడ్, ఎల్లో కేటగిరి పరిశ్రమలు రాకుండా వాటికి ప్రత్యేక ప్రాంతాలను కేటాయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బస్సులు, ఎంఎంటీఎస్, మైట్రో వంటి ప్రాజెక్టుతో వాటితో అనుసంధానం చేయనున్నారు.