|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 10:51 AM
సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఉన్న 1253.8 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా ఆదివారం కాపాడింది. దీని విలువ రూ. 7 కోట్ల విలువ ఉంటుందని అంచనా. చక్రపురి కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో పార్కు ఆక్రమణలకు గురవుతోందని ఫిర్యాదు చేసింది. కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. సర్వే నంబర్ 135, అమీన్పూర్ గ్రామంలో ఉన్న ఈ పార్క్ భూమి మొత్తం 1253.8 చదరపు గజాలు విస్తీర్ణంలో ఉంది. ఈ భూమిని గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ నెం. 12343/2022 (తేదీ: 31 మార్చి 2022) ప్రకారం, స్థానిక సంస్థలకు ప్రజా వినియోగం కోసం లేఔట్ వేసిన వారు అప్పగించారు. ఈ స్థలాన్ని HUDA లేఅవుట్ అనుమతి LP నెం. 3814/MP2/HUDA/85 ప్రకారం పార్క్, రోడ్ల అభివృద్ధికి కేటాయించారు. పార్కు కోసం కేటాయించిన స్థలం సరిహద్దు రాళ్లు తొలగించినట్టు గుర్తించారు. ఈ మేరకు హైడ్రా ఆదివారం పార్కును కాపాడుతూ చర్యలు తీసుకుంది. పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. పార్కును కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా జిందాబాబు అంటూ నినాదాలు చేశారు.