|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:01 PM
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీగా మహిళలు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకోవడంతో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఫుల్ అవుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో డీలక్స్, లగ్జరీ, ఏసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండటం లేదు. ఇక హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ ) ఏసీ బస్సులను ఆయా రూట్లలో నడుపుతోంది. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలు ఈ ఏసీ బస్సుల వైపు చూడటం లేదు. ఇక టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పురుషులు కూడా చాలా మంది ఈ ఏసీ బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు.
అది గమనించిన టీజీఎస్ఆర్టీసీ అధికారులు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్ బస్సులు 60 శాతం నుంచి 70 శాతం వరకు ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులను ఏసీ బస్సుల్లో ఎక్కేలా చేయాలని నిర్ణయించుకుంది. టికెట్పై కనిష్టంగా రూ.5 తగ్గించగా.. గరిష్టంగా రూ.10 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఏసీ బస్సుల్లో 5 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం టికెట్ ధర రూ.50 ఉండగా.. తాజాగా ప్రకటించిన రాయితీతో కేవలం రూ.40 కే ప్రయాణించవచ్చు. అదే విధంగా 10 స్టేజీలు లేదా 20 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.55 టికెట్ ధర ఉండగా.. రూ.10 రాయితీ కల్పించడంతో రూ.45 కే ప్రయాణించవచ్చు.
హైదరాబాద్ నగరంలో హైటెక్సిటీ, గచ్చిబౌలి, మణికొండ, కొండాపూర్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కోఠీ, ఉప్పల్, ఇబ్రహీంపట్నం సహా చాలా ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు ఏసీ బస్సులను నడుపుతున్నప్పటికీ.. ఆశించిన మేర మాత్రం ప్రయాణికుల నుంచి ఆదరణ రావడం లేదు. దీంతో ప్రస్తుతం ఎండాకాలం రానున్న నేపథ్యంలో ప్రయాణికులను ఏసీ బస్సులు ఎక్కేలా అధికారులు టికెట్ ధరలపై రాయితీలను ప్రకటించారు. ఈ టికెట్ ధరల తగ్గింపు మార్చి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.