|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:19 PM
వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. ఇవాళ తెలంగాణకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన వేళ.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై రాహుల్ గాంధీని కవిత నిలదీశారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కవిత.. 'రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు. రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి' అని పేర్కొన్నారు.
ఇక పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. పార్టీ చేపట్టే కార్యక్రమాల నిర్వహణ సహా అనేక అంశాలపై హస్తం పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. గత 9 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ట్రైనింగ్ శిబిరం కొనసాగుతోంది. ఇవాళ జరిగే ముగింపు సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.