|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:59 PM
అమీన్పూర్ :చందానగర్ జాతీయ రహదారి నుండి శ్రీదేవి థియేటర్, బంధం కొమ్ము మీదుగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వరకు చేపడుతున్న 150 అడుగుల రహదారి విస్తరణలో నష్టపోతున్న భూమి మరియు ఇళ్ల యజమానులు అధైర్య పడవద్దని.. వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం బంధంకొమ్ము రహదారి విస్తరణ పనులపై అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం రహదారి విస్తరణ పనులు చేపడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో బంధం కొమ్ము రహదారి పక్కనే చెరువు ఉండడం మూలంగా ఒకే వైపు 150 అడుగుల రహదారి విస్తరణ మూలంగాఇళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు.
రహదారి విస్తరణ మూలంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా.. చెరువు సమీపంలో రహదారికి సమాంతరంగా బ్రిడ్జి నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు.. ఈ అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అవసరమైన పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లి ఇళ్ల యజమానులు నష్టపోకుండా వారికి భరోసా అందించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఎమ్మార్వో వెంకటేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.