|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:26 PM
అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు సహా ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగుతోంది. ఇజ్రాయెల్ సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు తమ గగనతలాలను పూర్తిగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు.
గత ఐదు రోజుల క్రితం మంత్రి తుమ్మల దుబాయ్ వెళ్లగా యుద్దం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుండగా.. మెరుగైన వైద్య సహాయం కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ట్రీట్మెంట్ అనంతరం తిరిగి ఇండియాకు రావాలని భావిస్తున్న తరుణంలోనే పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీంతో మంత్రి ప్రయాణానికి ఆటంకం ఏర్పడి అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై పడింది. నిన్నటి రోజున దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్-3 సమీపంలో క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల కుటంబంతో సహా దుబాయ్లోనే చిక్కుకుపోయారు.
కాగా, ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులు విమాన రాకపోకలపై క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వారు స్వదేశానికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక యుద్ధం కారణంగా సినీ హీరో మంచు విష్ణు కుటుంబం కూడా దుబాయ్లోనే చిక్కుకున్న విషయం తెలిసిందే. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్లో చిక్కుకుపోయారు.