|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 06:18 PM
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు అకాల వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో గత రెండ్రోజులుగా వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో వచ్చే 2 గంటల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వచ్చే 2 గంటల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక జోన్ల వారీగా చూసుకుంటే.. జోన్ 1లో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
అలాగే రాత్రి నుంచి ఉదయం వరకు జోన్ 2లో మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వాతావరణం చూసినట్లయితే.. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నగరవాసులు తమ ప్రయాణాలను ఫ్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా, ఈ ఏడాది ముందుగానే ఎండాకాలం వచ్చేసింది. సాధారణంగా మార్చి మెుదటి వారంలో ఎండల తీవ్రత పెరుగుతుంది. దానికి భిన్నంగా ఈసారి ఫిబ్రవరి రెండో వారంలోనే భానుడి భగభగలు మెుదలయ్యాయి. గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబడగా.. రానున్న రోజుల్లో ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.