|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:15 PM
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు నిర్వహించే శోభాయాత్ర నేపథ్యంలో సాధారణ వాహనాల రాకపోకలను పలు మార్గాల్లో మళ్లించారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగర పోలీసులు సూచించారు.శోభాయాత్ర సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పురానాపూల్, బహదూర్పురా, మదీనా, సిటీ కాలేజీ, జియాగూడ తదితర ప్రాంతాల్లో ఈ మళ్లింపులు ఉంటాయి. శంషాబాద్, అత్తాపూర్ నుంచి పురానాపూల్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను అరాంఘర్ వద్ద చంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు. అరాంఘర్ నుంచి బహదూర్పురా వైపు వచ్చే వాహనాలను కిషన్ బాగ్, కామటిపురా మీదుగా పంపిస్తారు.అదేవిధంగా మదీనా నుంచి బహదూర్పురా వెళ్లే వాహనాలను గుడ్విల్ కేఫ్ వద్ద పార్థీవాడ వైపు, సిటీ కాలేజీ నుంచి పురానాపూల్ వెళ్లే ట్రాఫిక్ను ఎంజే బ్రిడ్జ్ వైపు మళ్లిస్తున్నారు. జియాగూడ నుంచి వచ్చే వాహనాలను పురానాపూల్ ఎక్స్ రోడ్ వద్ద జుమెరాత్ బజార్ వైపు పంపిస్తారు. యాత్ర ప్రశాంతంగా జరిగేందుకు ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.