|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:40 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ )ని విభజించి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ.. ఇటీవలె రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీతోపాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లను కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఈ విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందిన గురువారెడ్డి అనే బిజినెస్మెన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని.. దీనిపై స్టే విధించాలని కోరారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలె జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ జీవో నంబర్ 55 జారీ చేసింది. ఈ జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ గురువారెడ్డి హైకోర్టుకెక్కారు. కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా లెక్కలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఈ జనాభా లెక్కలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన సర్కులర్కు ఈ జీహెచ్ఎంసీ విభజన విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అదే సమయంలో దేశంలో జనగణన పూర్తి అయ్యే వరకు ఈ జీవో నంబర్ 55పై స్టే విధించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
జనగణన పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీని విభజించకుండా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే యథావిధిగా ఉంచాలని హైకోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై తర్వాతి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం వెల్లడించింది.
జీహెచ్ఎంసీని విభజించిన ప్రభుత్వం.. మూడు కార్పొరేషన్లకు ముగ్గురు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ను కొనసాగించగా.. సైబరాబాద్ కమిషనర్గా శ్రీజన.. మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డిలకు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్ ప్రాంతాలను ఉంచారు. సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, శంషాబాద్ జోన్లు జీహెచ్ఎంసీలోనే ఉండనున్నాయి.