|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 08:08 PM
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. చాలా మంది ఈజీ మనీ కోసం సైబర్ నేరాల బాట పడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అమాయకులను టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. సైబర్ నేరాల్లోనూ రోజుకో కొత్త తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులోనూ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. మేం సీబీఐ, ఈడీ, ఇన్ కం ట్యాక్స్ నుంచి కాల్ చేస్తున్నామని అమాయకలకు వీడియో కాల్స్ చేస్తున్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని.. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆందోళనకు గరవుతున్న చాలా మంది అడిగిన వెంటనే డబ్బులు పంపుతున్నారు. చాలా మంది చదువుకున్న వారు డిజిటల్ అరెస్టు కారణంగా కోట్లు నష్టపోయారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు. ఓ వ్యక్తి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి..? మనల్ని సైబర్ కేటుగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు.. ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను వివరించారు. ఆ వీడియోను సజ్జనార్ ట్విట్టర్ ఎక్స్లో పోస్టు చేశారు. పోలీస్ వేషం చూసి మోసపోవద్దని.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకూడదని హెచ్చరించారు. అసలు డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవని చెప్పారు.
'డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి.. వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు. దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి.' అని సజ్జనార్ వెల్లడించారు.