|
|
by Suryaa Desk | Sun, Feb 15, 2026, 07:03 PM
తెలంగాణలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లంబాడా యువతకు తమ ప్రభుత్వం అంటుందని అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో లాంబాడా యువకులది కీలక పాత్ర అని గుర్తుచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణలోని అన్ని లంబాడా తండాలను అభివృద్ధి చేస్తామని.. మౌళిక వసతుల కల్పనల్లో భాగంగా.. బీటీ రోడ్లు వేయిస్తామన్నారు. ఈ మేరకు సభ నుంచి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి రాష్ట్రంలో రోడ్లు లేకుండా ఏ తండా ఉండకూదని చెప్పారు.
మరో నాలుగు నెలల్లో తాను 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని గుర్తు చేశారు. ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. తాను మెుదటిసారి ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు లంబాడా యువత తన వెన్నంటి ఉండి గెలుపుకు కృషి చేశారని గుర్తు చేశారు. తండాల్లో విద్యను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా.. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. లంబాడా యువకులు అందరూ తమ భవిష్యత్తును గొప్పగా మల్చుకోవాలని సూచించారు. తండాల్లోనే ఉంటాం.. ఇక్కడే ఉపాధి పొందాతాం అనే ధోరణిని మైండ్లో నుంచి తీసేయాలని సూచించారు. బాగా చదివి గ్రూపు-1, గ్రూపు-2, డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని.. అందుకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక క్లారిటీ ఇచ్చారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. మరిన్ని ఉద్యోగాలు భర్తు చేస్తామన్నారు. ఇక రైతులను ఆదుకునేందుకు ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు.