|
|
by Suryaa Desk | Sun, Feb 15, 2026, 07:34 PM
ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కన్నుమూశారు. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో.. ఖమ్మం-సూర్యపేట పాత రహదారిపై వేగంగా వచ్చిన కారు పాలేరు రిజర్వాయర్ రక్షణ గోడను ఢీకొట్టి, నీళ్లలోకి దూసుకెళ్లింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయారు. శ్రీనివాస్ స్వస్థలం ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరు.
కారు పాలేరు జలాశయంలోకి దూసుకెళ్తున్న సమయంలో.. దాన్ని నడిపిన వ్యక్తి మాత్రం దాన్నుంచి బయటకు పడిపోయారు. ఆ తర్వాత వెంటనే లేచి అక్కడి నుంచి పారిపోవడాన్ని రిజర్వాయర్లో చేపలు పడుతున్న మత్స్యకారులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన జాలర్లు కారును బయటకు తీయగా.. వెనుక సీట్లో ఉన్న శ్రీనివాస్ అప్పటికే చనిపోయారు. ఆయన తలకు గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్ బాడీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
ప్రమాదానికి గురైన కారు నంబర్ ఆధారంగా దాని యజమానిని గుర్తించారు. ఇది పల్నాడు జిల్లాలోని పాకాలపాడు గ్రామానికి చెందిన మాధవరెడ్డికి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. మాధవరెడ్డి, శ్రీనివాస్ స్నేహితులు అని సమాచారం. కారు ప్రమాదానికి గురవగానే.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోవడం అనుమానాస్పదంగా మారింది. శ్రీనివాస్ ప్రమాదంలోనే చనిపోయాడా లేదంటే ముందే చంపేసి ప్లాన్ ప్రకారమే పాలేరు వద్ద ప్రమాదానికి గురైనట్లు చిత్రీకరించారా? అలాగే సూర్యాపేట నుంచి ఖమ్మం రావడానికి కొత్త హైవే అందుబాటులోకి ఉన్నప్పటికీ.. పాత మార్గంలో ఎందుకు వస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన బొగ్గుల శ్రీనివాస్ అనేక పుస్తకాలు రాశారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో.. ‘పవన్ కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట ఆయన పుస్తకం రాశారు. ఈ బుక్ 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయింది. బొగ్గుల శ్రీనివాస్ను అరెస్ట్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్ ఆందోళనలు నిర్వహించారు. దీంతో 2014 చివర్లో హైదరాబాద్లో నిర్వహించిన బుక్ ఫెయిర్ సమయంలో బొగ్గుల శ్రీనివాస్కు తెలంగాణ సర్కారు రక్షణ కూడా కల్పించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లే ఆయన చనిపోయారేమో అనే అర్థం ధ్వనించేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దాదాపు 12 ఏళ్ల క్రితం పుసక్తం రాస్తే.. ఇప్పుడు అతడి మరణాన్ని పవన్ ఫ్యాన్స్ పనే అన్నట్టుగా కామెంట్స్ చేయడం సరైందని కాదనే వాదన కూడా వినిపిస్తోంది. శ్రీనివాస్ మరణానికి, పవన్ కళ్యాణ్కు లింక్ పెట్టేలా కథనాలు రాస్తే పరువునష్టం దావా వేస్తామని జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి హెచ్చరించారు.
బొగ్గుల శ్రీనివాస్ చనిపోవడానికి ముందు రోజు లాయర్ జడ శ్రవణ్ కుమార్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారంటూ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో ఆయన ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్లో కనిపించకపోవడం గమనార్హం. బొగ్గుల శ్రీనివాస్ ఆరేళ్ల క్రితమే వైఎస్సార్సీపీని, జగన్ను విమర్శిస్తూ మాట్లాడిన వీడియో ఇదంటూ మరో వీడియోను సైతం బయటకు తెస్తున్నారు. మొత్తానికి పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ.. బొగ్గుల శ్రీనివాస్ ప్రమాదంలో చనిపోయారా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది తేలదు. అప్పటి దాకా సోషల్ మీడియాలో ఇలాంటి ఆరోపణలు ఆగవేమో.