|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:36 PM
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. బుధవారం ఉదయం భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని యూజర్లు యూట్యూబ్ యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ను ఓపెన్ చేయగానే "సమ్థింగ్ వెంట్ రాంగ్" అనే ఎర్రర్ మెసేజ్ కనిపించడంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు.ఆన్లైన్ సేవల పనితీరును పర్యవేక్షించే 'డౌన్డిటెక్టర్' ప్రకారం అమెరికాలో దాదాపు 3.20 లక్షల మందికి పైగా యూజర్లు ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. వీరిలో 74 శాతం మందికి యాప్లో సమస్యలు తలెత్తగా, 16 శాతం మందికి వీడియో స్ట్రీమింగ్లో ఇబ్బందులు ఎదురైనట్లు తేలింది. ఉదయం 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో దాదాపు 20,000 ఫిర్యాదులు నమోదయ్యాయి.ఈ అంతరాయంపై సోషల్ మీడియా వేదికగా యూజర్లు పెద్ద ఎత్తున స్పందించారు. తమ ఫోన్లలో, టీవీలలో లాగిన్ అవ్వలేకపోతున్నామని, ఖాతాలు మార్చుకోలేకపోతున్నామని కొందరు పేర్కొన్నారు. మరికొందరు తమకు యూట్యూబ్ పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని, కేవలం సైడ్బార్ మాత్రమే పనిచేస్తోందని స్క్రీన్షాట్లను షేర్ చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో యూట్యూబ్ స్పందించింది. "ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. దీనిని పరిశీలిస్తున్నాము. పరిష్కారం ఇంకా లభించనప్పటికీ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాము. తదుపరి అప్డేట్లను తెలియజేస్తాం" అని ఒక ప్రకటనలో పేర్కొంది.