|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 01:26 PM
130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లండ్ నుంచి నగరానికి వచ్చారు. 19 సంవత్సరాల పాటు సాగించిన అన్వేషణ ఫలించడంతో, తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు. ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా, తన ముత్తాత (తాతకు తండ్రి) చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగళూరు, మద్రాసులలో పనిచేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న సమయంలో, 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో మరణించారు. అప్పట్లో ఆయన వయసు 48 సంవత్సరాలు.అప్పటి నుంచి తన ముత్తాత సమాధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని రాబిన్ డిక్సన్ గట్టిగా సంకల్పించుకున్నారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్లలో గాలించారు. ఈ క్రమంలో స్థానిక పాత్రికేయుడు రవిరెడ్డి సహాయంతో, ఎనిమిది నెలల క్రితం సికింద్రాబాద్లోని తిరుమలగిరి 'సెమెట్రీ-12'లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు.ఈ విషయం తెలియగానే రాబిన్ తన భార్య లిన్తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను" అని రాబిన్ తీవ్ర భావోద్వేగంతో అన్నారు.