|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:05 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సీఎం, మంత్రులు.. అటు ప్రభుత్వ పనులతోపాటు ఇటు పార్టీ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీ లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గైడ్.. తెలంగాణ మంత్రులు అందరితో కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశం అయినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు.. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించినట్లు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాబట్టి.. ఎన్నికల్లో తమను ఆశీర్వదించారని టీపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు గుర్చు చేసుకున్నారు. తెలంగాణలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మార్చి 15వ తేదీ లోపు రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదని.. వచ్చే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించి తిరిగి అధికారాన్ని కొనసాగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా ఢిల్లీలో హస్తం పార్టీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. బడ్జెట్కు ముందు ఈ ఢిల్లీ పర్యటన తీవ్ర ఆసక్తికరంగా మారింది.