|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:09 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత ఎమ్మెల్సే పదవికి కూడా కవిత రాజీనామా చేశారు. ప్రస్తుతం జాగృతి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. మే తొలి వారంలో తాను పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తాను పెట్టబోయే పార్టీ వ్యక్తుల మీద నడవద్దని.. వ్యవస్థల మీద నడవాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని.. తాను పోటీ చేసేందుకు ఫస్ట్ చాయిస్గా సిద్దిపేటను తీసుకుంటానన్నారు. సెకండ్ ఛాయిస్గా బోధన్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తానని వెల్లడించారు.
'ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దారిలోనే వెళ్తుంది. కొత్త తరహా రాజకీయం కాంగ్రెస్ చేయడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదనే కోపం కార్మికుల్లో ఉంది. బిల్లుల చెల్లింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నయం అనేలా ప్రస్తుత పాలన ఉంది. రెండేళ్లలో ఆర్టీసీలో సింగిల్ పర్మినెంట్ రిక్రూట్మెంట్ లేదు. ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ ఉండదు. ప్రధాన ప్రతిపక్షం మేమే అవుతాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి మేమే వస్తాం. వచ్చే ఎన్నికల్లో నా ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట. సెకండ్ ఛాయిస్ బోధన్. ప్రయారిటీల ఆధారంగా మేం సమస్యలపై పోరాటం చేస్తాం.
నేను పెట్టబోయే పార్టీ వ్యక్తుల మీద నడవద్దు. వ్యవస్థల మీద నడవాలి. ప్రాంతీయ పార్టీ లీడర్ సెంట్రిక్ ఉంటుంది. కానీ వ్యవస్థ నిర్మాణం జరగాలి. సైద్ధాంతిక పునాది ఉండాలి. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. ఆడవాళ్లే కదా అని అవమానించవద్దు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడ ప్రజలకు నచ్చలేదు. అదే షర్మిల ఈరోజు ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా...? నా లైన్లో నేను వెళ్తున్నా.. నా ప్రయత్నం నాది. తెలంగాణ వాదమే మా పార్టీ మొదటి లైన్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లు కేంద్ర మంత్రులు అయ్యారు. కొత్త తరానికి నేను పెట్టబోయే పార్టీలో అవకాశం ఉంటుంది.' అని కవిత వ్యాఖ్యనించారు.