|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:12 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంలో భాగంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక వర్గాల కోసం అదనంగా 35,921 ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత గూడు లేని నిరుపేదల కల సాకారం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని వేగవంతం చేస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ఈ అదనపు ఇళ్ల ప్రయోజనం ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, అనాథలు, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలకు అందనుంది. ఇప్పటికే ఈ వర్గాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో.. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వీరికి ఇళ్లను మంజూరు చేస్తోంది.
ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కేవలం సాధారణ దరఖాస్తుదారులకే కాకుండా, సమాజంలో వివక్షకు గురవుతున్న వారికి, శారీరక వైకల్యం ఉన్నవారికి, ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించడం ద్వారా సామాజిక భద్రతను పెంపొందించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది. గిరిజన ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆదివాసీలకు ప్రభుత్వమే నేరుగా ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. మిగిలిన వర్గాల లబ్ధిదారులకు మహిళా సంఘాల (SHGs) ద్వారా రుణాలు ఇప్పించి, నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగేలా చర్యలు చేపట్టింది. ఈ రుణ సదుపాయం వల్ల లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. మొత్తం మంజూరైన ఇళ్లు 3.69 లక్షలు. పనులు ప్రారంభమైనవి 2.45 లక్షలు కాగా.. పునాది దశలో ఉన్నవి 84 వేలు. గోడల దశలో ఉన్నవి 43 వేలు. శ్లాబ్ దశలో ఉన్నవి 52 వేలు. ముగింపు దశకు చేరుకున్నవి 1,311. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి దశలోనూ నిధులను విడుదల చేస్తూ.. పారదర్శకమైన పద్ధతిలో నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్రంలో సామాజిక సమానత్వం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం, లబ్ధిదారుల సహకారంతో ఈ ఏడాది చివరి నాటికి మెజారిటీ ఇళ్లు పూర్తి కానున్నాయి.