by Suryaa Desk | Sat, Feb 01, 2025, 07:51 PM
ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రేవంత్ ప్రభుత్వం సడలించింది. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు పదో అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్స్ కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్ల సర్వీస్తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న ఆయాలకు ప్రమోషన్ వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయసు 60 ఏళ్లు దాటినా వారిని కొనసాగించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వర్సిటీల రిజిస్ట్రార్లకు ప్రత్యేకంగా లెటర్ రాశారు. 2024 ఆగస్టు 8న అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వారి అవసరం, పనితీరు, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని 60 ఏళ్లు దాటినా ఉద్యోగంలో కొనసాగించాలని అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అనేక వర్సిటీలు ఆ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
దీంతో కాళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గత ఉత్తర్వులను పేర్కొంటూ తాజాగా మరోసారి ఆదేశాలిచ్చారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ జనవరి 28వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే తాజాగా ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా కొనసాగించాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇస్తేనే దాన్ని వర్సిటీలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్తో ఎందుకు ఉత్తర్వులు ఇప్పించారో అర్థం కావట్లేదని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో సుమారు 1200 మంది సహాయ ఆచార్యులు పనిచేస్తున్నట్లు తెలిసింది.