by Suryaa Desk | Sun, Feb 02, 2025, 04:44 PM
అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం వార్తలు వస్తున్నాయి. ఓ మంత్రి వ్యవహార శైలిపై వీరు గుర్రుగా ఉన్నారని.. పనుల కోసం కలిసి ఒత్తిడి చేద్దామని భేటీలో చర్చించినట్లు గత రెండు, మూడ్రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం జరిగిన మంత్రుల భేటీలో ఈ వ్యవహారంపై చర్చ జరగ్గా.. గట్టిగానే వ్యవహరిద్దామని సీఎం, కొందరు మంత్రులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు సమావేశమైన మాట నిజమేనని స్పష్టం చేసారు. కానీ తాము రహస్యంగా భేటీ కాలేదని చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా? అని ప్రశ్నించారు. తాను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదన్నారు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక పూర్తి వివరాలు చెబుతానని అన్నారు.
ఎమ్మెల్యేలు భేటీ అయిన మాట నిజమే. నేను ఏ ఫైల్ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు. అసలు అది ఏ ఫైల్ అనేది ఎంపీ మల్లు రవి గారు చెప్పాలి. మేమేం రహస్యంగా సమావేశం కాలేదు. అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిశాక అన్ని విషయాలు మాట్లాడుతా.. అన్ని వివరాలు చెబుతా. నా క్యారెక్టర్ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలిసిందే. అన్ని ఆధారాలతో పెద్దలతో మాట్లాడుతా' అని అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ వార్తలపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాము ఏ రహస్య సమావేశంలోనూ పాల్గొనలేదని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా కొందరు కావాలనే ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానన్నారు.