by Suryaa Desk | Mon, Feb 03, 2025, 12:12 PM
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల10వ తేదీకి వాయిదాపడింది. ఈ కేసును మొన్నటి ముగ్గురు ఎమ్మెల్యేల కేసుతో ట్యాగ్ చేసింది సుప్రీం ధర్మాసనం.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ఈ కేసు ఈనెల పదో తేదీకి వాయిదాపడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. పోచారం, సంజయ్, మహిపాల్రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు పంపింది.కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. జనవరి 31న ఈ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్.అయితే పార్టీ ఫిరాయింపులపై గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటూ బీఆర్ఎస్ నేతలు కూడా ధీమాతో ఉన్నారు.. అందుకు తగ్గట్టే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై.. నాలుగువారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అప్పట్లో స్పీకర్ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్… ఈ అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీమారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్.. అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని.. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.