by Suryaa Desk | Sun, Feb 02, 2025, 04:37 PM
మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం అందించటం కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు.. తెలంగాణ ప్రభుత్వం రూ.37 కోట్ల 50 లక్షలు నిధులు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పురపాలక శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాలుష్య కారకాలతో నిండిపోయిన మూసీ నదిని పునరుజ్జీవం చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మూసీ సుందరీకరణ కోసం చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివశించేవారిని ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారిని అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసంతో పాటుగా.. ఆర్థిక సాయం చేస్తామని తెలంగాణ సర్కారు గతంలో ప్రకటించింది. అందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న కుటుంబాలకు రూ. 25 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే 15 వేల కుటుంబాలకు 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు.. ఈ రూ.37.50 కోట్లను విడుదల చేశారు.
మరోవైపు మూసీ నిర్వాసితుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అలాగే హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16 వేలకు పైగా ఇళ్లను వీరికి ఇచ్చేలా గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో సైతం అధికారులు వేగం పెంచారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు.
మూడు జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే చేసిన అధికారులు.. మూసీ నదీ గర్భంలోనూ, బఫర్జోన్లోనూ సుమారు పదివేలకుపైగా నిర్మా్ణాలను గుర్తించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఇంటింటి సర్వే కూడా నిర్వహించారు. అలాగే పునరావాసం కల్పించిన తర్వాతే ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం, పునరావాసం అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.