by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:27 PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.ఇదే అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ప్రశ్నించింది.