|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:02 PM
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) జనవరి 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ మంగళవారం ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం మీద 51.37 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరిగా పాస్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వేలమంది ప్రభుత్వ టీచర్లు అర్హత సాధించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.తాజా ఫలితాల ప్రకారం పరీక్షకు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 57.76 శాతం మంది (37,893 మంది) అర్హత సాధించారు. ఇతర అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం (48.14 శాతం)తో పోలిస్తే ప్రభుత్వ టీచర్ల పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ, గణనీయ సంఖ్యలో టీచర్లు విఫలమయ్యారు. మొత్తం మీద పరీక్ష రాసిన 1,95,181 మందిలో 1,00,270 మంది ఉత్తీర్ణులయ్యారు.టెట్ ప్రవేశపెట్టక ముందు నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్లో అర్హత సాధించాలని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువులోగా ఉత్తీర్ణత సాధించలేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలు సర్వీసులో ఉన్న టీచర్లకు కీలకంగా మారాయి.