|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:30 PM
మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించారు. మియామిలోని అత్యంత ఖరీదైన, భద్రత కలిగిన 'ఇండియన్ క్రీక్ ఐలాండ్'లో ఏకంగా 170 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,415 కోట్లు) వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. మియామి-డేడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఇంటి ఒప్పందంగా రికార్డు సృష్టించింది.'బిలియనీర్ బంకర్'గా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపంలో ప్రస్తుతం ఈ భవనం నిర్మాణ దశలో ఉంది. 1.84 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మెగా మాన్షన్లో 9 బెడ్రూమ్లు, 11 బాత్రూమ్లు, వాటర్ ఫ్రంట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ డాక్ వంటివి ఉన్నాయి. అత్యాధునిక జిమ్, హెయిర్ సెలూన్తో పాటు లైబ్రరీలో ఒక రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తుండటం దీని ప్రత్యేకత.ఈ ద్వీపంలో కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉంటాయి. నివాసితుల కోసం ప్రత్యేక పోలీస్ దళంతో అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇక్కడ రెండు ఇళ్లు కొనుగోలు చేయగా, ఇప్పుడు జుకర్బర్గ్ కూడా ఆయనకు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.