|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:12 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో జరుగుతన్న ఆ ప్రచారం మొత్తం ఫేక్ అని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ సోషల్ మీడియాలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు సంబంధించి వస్తున్న వార్తలను ఖండించింది.
ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేసింది. రాష్ట్ర ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది. ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే.. దాన్ని పత్రికా ప్రకటన ద్వారా టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తామని తేల్చి చెప్పింది.
తెలంగాణలోని దివ్యాంగ పురుషులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోపు ఏ ప్రాంతానికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చని అందులో ఉంది. అంతర్రాష్ట్ర పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దు వరకు దివ్యాంగులైన పురుషులు ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు అదంతా అబద్ధం అంటూ వివరణ ఇచ్చారు.