|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:14 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ పార్టీ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లోని అత్యధిక వార్డుల్లో విజయం సాధించిన ఎర్రదళం.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. అయితే మెజార్టీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో.. సీపీఐకి ఇతర పార్టీల మద్దతు అవసరం కానుంది. సీపీఐ ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇలాఖాలో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండటంతో.. ఆ పార్టీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మొత్తం 60 వార్డులకు గానూ 25 వార్డుల్లో సీపీఐ విజయం సాధించింది.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ-టీడీపీ కూటమిగా పోటీ చేయగా.. సీపీఐ 22 వార్డులను గెలుచుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 22, బీఆర్ఎస్ పార్టీకి 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 31 కాగా.. సీపీఐ పార్టీకి మరో 9 కార్పొరేటర్ల మద్దతు అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీపీఐ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ పూర్తిగా మద్దతు తెలపడంతో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఆ పార్టీకి ఇచ్చింది. ఈ కొత్తగూడెం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించి.. ఏకైక సీపీఐ ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా సీపీఐ విజయం సాధించడంతో మళ్లీ సీపీఐ-కాంగ్రెస్ నేతృత్వంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.
అయితే సీపీఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు సరైన గౌరవం కల్పించలేదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేసినట్లు వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. సీపీఐ కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే సీపీఐ పార్టీ.. కొత్తగూడెంలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకోవడంతో.. ఎర్రసైన్యంలో నూతనోత్తేజం నెలకొంది.
మరోవైపు.. సీపీఐ పార్టీ తమ పాత మిత్రుడైన బీఆర్ఎస్తో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సీపీఐకి 25 స్థానాలు, బీఆర్ఎస్కు 9 స్థానాలు ఉండటంతో ఈ రెండు పార్టీలు కలిస్తే.. సులువుగా మేయర్ కుర్చీని దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వామపక్ష పార్టీ అయిన సీపీఎం, ఐదుగురు స్వతంత్రులు సీపీఐకి మద్దతు పలికినా.. మేయర్ సీటును దక్కించుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.