|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:20 PM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మెుత్తం 48 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో, బీఆర్ఎస్ 10 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్లో హంగ్..
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మెుత్తం 20 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి మెజార్జీ రాలేదు. కాంగ్రెస్ 8 , బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. దీంతో అక్కడ క్యాంపు రాజకీయాలు మెదలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీజేపీ తోపులాట చేసుకోగా.. వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా..
ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యంతో మెజార్టీ మున్సిపాలిటీలను హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ వద్ద ఆ పార్టీ నేతలు బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు.
బీఆర్ఎస్ దక్కించుకున్న మున్సిపాలిటీలు ఇవే..
మున్సిపల్ ఫలితాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. ఇప్పటి వరకు 33 మున్సిపాలిటీలకు లెక్కింపు పూర్తి కాగా.. కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 6 చోట్ల విజయం సాధించాయి. తొర్రూరు, ఇంద్రేశం, ఐజ, గుమ్మడిదల, గడ్డిపోతారం, క్యాతన్పల్లిలో మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. కోహిర్, కేసముద్రం, అలంపూర్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవటంతో హంగ్ ఏర్పడింది.
ఖమ్మంలో కాంగ్రెస్ జోరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత మున్సిపాలిటీ మధిరతో పాటు అశ్వరావుపేట మున్సిపాలిటిని ఆ పార్టీ హస్తగతం చేసుకుంది. వైరా, ఇల్లందులోనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేటీఆర్ సొంత మున్సిపాలిటీ సిరిసిల్లలో బీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ సత్తా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. బాన్సువాడ, కామారెడ్డి రెండు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన మెజార్టీ వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే లీడ్లో కొనసాగుతున్నారు.
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెళ్లడైన ఫలితాల ప్రకారం.. 4 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండతో పాటు హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో మెజార్డీ వార్డులు దక్కించుకొని ఛైర్మన్ పీఠాలను దక్కించుకున్నాయి.
నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నందికొడం మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించకుంది. ఇక్కడ మెుత్తం 12 వార్డులు ఉండగా.. 11 వార్డుల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశమైంది.
తొలి ఫలితం.. బీఆర్ఎస్ కైవసం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మెుత్తం 18 వార్డులు ఉండగా.. 14 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో రెండు కాంగ్రెస్ సాధించగా.. రెండింటికి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడటంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం
ఇక ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. మెుత్తం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ 52 వార్డుల్లో విజయం సాధించింది. 20 స్థానాల్లో బీఆర్ఎస్, 11 స్థానాల్లో బీజేపీ, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.
టీడీపీ అభ్యర్థి విజయం
ఖమ్మం జిల్లా మధిరలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 10వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి గెలుపొందారు. ఇక పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మెజార్టీ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
బోణి కొట్టిన బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. 11, 12, 13 మూడు వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 12 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్
పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. నాగర్ కర్నూల్, మధిర, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. నిర్మల్, ఖానాపూర్, ఆదిలాబాద్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. ఎదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతోంది.
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
సంగారెడ్డి మన్సిపాలిటీ కౌంటర్ సెంటర్లో కరెంట్ లేక ఇబ్బందులు
మంచిర్యాల లక్షిట్టిపేట 10 వార్డు బీజేపీ అభ్యర్థి మృతి
ఉదయం అనార్యోగంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ
పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
మెుత్తంగా 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవం
కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 12 చోట్ల విజయం
ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి అధికారులు లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా మున్సిపాలిటీల ఫలితాలపై స్పష్టత రానుండగా... సాయంత్రం లోపు కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద, స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు నేరుగా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రంలోకి కేవలం గుర్తింపు కార్డులు ఉన్న కౌంటింగ్ సూపర్వైజర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. సెల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరించారు.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. అనంతరం సాధారణ బ్యాలెట్ బాక్సులను టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ఓట్లను విడదీసే క్రమంలో పారదర్శకత కోసం అధికారులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొదట బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్లను ఒకే డ్రమ్ములో వేసి కలిపేస్తారు. ప్రతి రౌండ్లోనూ డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్లను తీసి టేబుళ్లకు పంపిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసేందుకు ప్రత్యేక కంపార్ట్మెంట్లున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను ఏజెంట్లకు చూపిస్తూ.. నోటా చెల్లని ఓట్లను వేరు చేస్తారు. ప్రతి అభ్యర్థికి 100 ఓట్లు రాగానే ఒక కట్టగా కట్టి, మిగిలిన ఓట్ల వివరాలను స్లిప్పులపై నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో ఫలితాలను షీట్లలో నమోదు చేసి, సంతకాలు తీసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. విజేతలకు వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.
మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. వార్డు, డివిజన్కు వేర్వేరుకో ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్లో వేయి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. మున్సిపాలిటీల్లోని చాలా వార్డుల్లో ఉదయం 11 గంటల లోపే ఫలితాలు రానున్నాయి. అలంపూర్లో 7,104 ఓట్లు పోలవ్వగా.. దాని ఫలితం మొదటగా మొదటి రౌండ్లోనే వచ్చే ఛాన్సుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఫలితాల్లో మాదిరిగానే అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుందా..? కారు జోరు చూపిస్తుందా..? కమల వికాసం ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లే తేలనుంది.
ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హహ..
ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ్గా.. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అభిప్రాయపడింది. 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68-76 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ 29-36, బీజేపీ 3-5 స్థానాల్లో గెలవనుందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 29.7 శాతం, బీజేపీ 19.3 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది. వార్డుల వారీగా చూసినట్లయితే.. మొత్తం 2,569 వార్డులలో కాంగ్రెస్ 1210-1290 స్థానాల్లో విజయం సాధిస్తుందని..బీఆర్ఎస్ 860-930 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉందని చెప్పింది.