|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:24 PM
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని.. మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. అదే సమయంలో కార్పొరేషన్లలో కూడా అధిక వార్డులను హస్తం పార్టీ నేతలే గెలుచుకున్నారు. కానీ కొన్ని మున్సిపాలిటీలు మాత్రం హంగ్ వచ్చాయి. ఆ మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఓటర్లు అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా.. ఇటు బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో.. సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మున్సిపాలిటీల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఇప్పుడు తప్పనిసరిగా మారింది. తమ మద్దతు అవసరం కావడంతో.. స్వతంత్ర అభ్యర్థులకు భారీగా డిమాండ్ నెలకొంది.
మరోవైపు.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపుల రాజకీయాలు ఇప్పుటికే తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే గెలిచిన వారు చేజారిపోకుండా ఉండేందుకు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. ఎవరికీ తెలియకుండా రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లాయి. ఇక హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మెజారిటీ మార్కును అందుకునేందుకు ఇతర పార్టీలు, మరీ ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్నాయి. తమ పార్టీకి మద్దతు తెలిపిన వారికి భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఏది అడిగినా చేసే విధంగా వారిని బుజ్జగిస్తూ.. తమ వైపు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే.. ఇదే అదునుగా భావిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు.. గొంతెమ్మ కోరికలకు తెరలేపుతున్నారు. తమకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ మద్దతు కావాలంటే.. తామే మున్సిపల్ ఛైర్మన్ కుర్చీలో కూర్చుంటామని తేల్చి చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇన్ని రోజులు తమ పార్టీ కోసం పనిచేసి.. తమ పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా గెలిచిన వారిని కాదని.. ఇప్పుడు మద్దతు తెలిపిన వ్యక్తికి మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఎలా కట్టబెడతామని అయోమయంలో పడ్డాయి.
అంతేకాకుండా ఒకవేళ వారికి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అప్పగించినా.. ఆ తర్వాత తమ పార్టీ నుంచి జంప్ అయితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తున్నాయి. అంతమందిని గెలిపించుకున్నా.. మెజార్టీ మార్కును అందుకోకపోవడంతో.. ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి చాలా దారుణంగా మారింది. దాదాపు ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను బట్టి చూస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఆ మున్సిపాలిటీ పరిధిలో జోరుగా అభ్యర్థులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 11 మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ప్రచారం చేసిన ఏడో వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్.. తన సీటులో గెలుపొందారు. అలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. అందులో కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు.. బీఆర్ఎస్ 7 వార్డులు, బీజేపీ 3 వార్డులు.. ఒక వార్డులో బీఎస్పీ విజయం సాధించాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన గాదె వెంకటేష్ మద్దతు కీలకంగా మారింది. దీంతో ఆయనను ఒప్పించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేయగా.. మున్సిపల్ ఛైర్మన్ పదవిని తనకు ఏ పార్టీ ఇస్తే వారికే తాను మద్దతు తెలుపుతానని గాదె వెంకటేష్ తేల్చి చెప్పడంతో పార్టీలకు పెద్ద షాక్ తగిలినట్లయింది.
మరోవైపు.. జనగామ మున్సిపాలిటీలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాన వార్డుల్లో విజయం సాధించగా.. 15వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి పాండు మద్దతు రెండు పార్టీలకు కీలకంగా మారింది. దీంతో అతడి మద్దతు పొందేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్, బీఆర్ఎస్లు.. పాండును తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది. అయితే తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానంటేనే ఏ పార్టీకైనా మద్దతు పలుకుతానని చెప్పడంతో వారు షాక్కు గురయ్యారు.