|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 10:48 AM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బులా్లపూర్ మండలం, జీడిమెట్ల విలేజ్, సుభాష్ నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీ లే ఔట్ను 1968లో వేశారు. 80 ఎకరాలలో 810 ప్లాట్లతో ఈ లే ఔట్ వేసి.. ఇందులో 10 పార్కులను కేటాయించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడకు విద్యుత్ను అందించేందుకు వేసిన హైటెన్షన్ కరెంటు లైను ఈ లే ఔట్ మీదుగా వెళ్లింది. దీంతో హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద పలు పార్కులను అప్పటి లే ఔట్ వేసిన వారు కేటాయించారు. వేరే లైను ద్వారా పారిశ్రామిక వాడకు విద్యుత్ను అందించడంతో భాగ్యలక్ష్మి కాలనీ మీదుగా వెళ్లే హైటెన్షన్ వైర్లను 20 సంవత్సరాల క్రితం తొలగించారు. ఇక అక్కడి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి. స్థానిక అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు చెందిన వారితో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించారు. పార్కు స్థలాలుగా నిర్ధారించుకున్నారు. శుక్రవారం వరుసగా ఉన్న 6 పార్కుల ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి కాలనీవాసులు సంబరాలు చేసుకున్నారు. బోర్డుల ముందు నిలబడి ఫొటోలు దిగారు. హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీలు తీసి సంబరాలు చేసుకున్నారు.