|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:12 PM
పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో సోమవారం ఉదయం పట్టణ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులతో పండుగల నిర్వహణపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు. వేద పండితుల సూచనల మేరకు పట్టణ ప్రజలు క్రింది తేదీలలో పండుగలను సంప్రదాయబద్ధంగా, ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని నిర్ణయించారు. మార్చి 4న హోలీ పండుగ, మార్చి 19న ఉగాది (తెలుగు ప్రజల నూతన సంవత్సరాది), మార్చి 27న శ్రీరామనవమి పండుగ, శ్రీరామనవమి సందర్భంగా ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలు, దీపాలంకరణలు, భక్తులకు త్రాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, పారిశుధ్య చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, సామరస్యంతో పండుగలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.