![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:12 PM
హైదరాబాద్ కాచిగూడ పీఎస్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దోషం పేరుతో ఓ నకిలీ స్వామిజీ మహిళా లెక్చరర్ను మోసం చేశాడు. దాదాపు 20 లక్షలతో ఉడాయించాడు. హైదరాబాద్ నగరంలో ఇంటి దిష్టి పోగతానంటూ ఓ ఫేక్ స్వామిజీని ఓ అధ్యాపకురాలిని మోసం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 20 లక్షలతో ఊడాయించాడు. కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ మహిళ దిల్సుఖ్నగర్లోని జూనియర్ కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. భర్త చనిపోవడం, కుటుంబ పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తరుచూ ఆవేదన వ్యక్తం చేసేది. కాలేజీ ప్రిన్సిపల్ సూచనతో ఆమె ఎల్బీనగర్కు చెందిన ఓ శివస్వామిని ఆశ్రయించింది. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న స్వామి ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటి దోషం కారణంగా భర్త చనిపోయాడని మాయ మాటలు చెప్పాడు. పూజలు చేయకుంటే ఇంకా అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపెట్టాడు. పూజల పేరుతో రూ. 1.70 లక్షలు వసూలు చేశాడు. కనకదుర్గ ఆలయంలో పూజల కోసం మరో 20 తులాల ఆభరణాలు లెక్చరర్ నుంచి తీసుకున్నాడు.
పూజలు చేస్తున్న క్రమంలోనే ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ ఆమెను భయపెట్టాడు. అలా కాచిగూడలోని ఇంటిపత్రాలను సైతం కాజేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అధ్యాపకురాలి కుమార్తె.. తల్లిని తీసుకుని శివస్వామి వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో తీసుకున్న ఇంటిపత్రాలను తిరిగి ఇచ్చేశాడు. నగదు, 20 తులాల బంగారం మాత్రం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాగా చదువుకున్న వారు కూడా ఇలాంటి ఫేక్ స్వామిజీ బుట్టలో పడటం కలవరపాటుకు గురి చేస్తుంది. అన్ని తెలిసి కూడా ఈజీగా మోసపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.