![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 08:45 PM
ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు జెన్కో ఉద్యోగాలను కల్పించింది. ఈ మేరకు నియామక పత్రాలను భట్టి విక్రమార్క స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించి యువత పోరాటం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశలను నెరవేరుస్తూ ఇప్పటికే 53 వేల మందికి నియామక పత్రాలను అందజేసిందని తెలిపారు.ప్రాజెక్టులలో భూమిని కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు చెప్పారని, కానీ భూనిర్వాసితులు వృద్ధులైపోయినా ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారి కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కోసం రూ. 9 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.ప్రపంచ ప్రసిద్ధి పొందిన కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదర్చుకుంటున్నామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ సూచన మేరకు నేదురమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని, నేడు ఐటీ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీలో మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ను విస్తరిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని, దాని ద్వారా ఉపాధి కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.