by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:28 PM
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో.. గ్యాస్ కంప్రెషర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. గాయాలైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఏప్రిల్లోనూ.. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అగ్గి రవ్వలు ఎగిసిపడటంతో.. క్షణాల్లోనే కంపెనీ మొత్తానికి మంటులు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోగా.. ఫైర్ సిబ్బందితో పాటు ఓ బాలుడి సమయస్ఫూర్తితో అందరు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోనూ జూన్ 25వ తేదీన భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జర్నలిస్ట్ కాలనీ బస్స్టాప్కు ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్లోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.