![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 08:58 PM
తెలుగు రాష్ట్రాలను హైదరాబాద్తో అనుసంధానం చేసే కీలక జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించనున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి, సెప్టెంబరులోనే పనులు ప్రారంభించాలని అధికారులను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నేషనల్ హైవేలపై హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల గురించి మాట్లాడారు.
‘‘ హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతూ పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జాతీయ రహదారి విస్తరణకు ఆటంకాలను తొలగించింది.. దీంతో టెండర్ ప్రక్రియను తర్వగా పూర్తి చేసి పనులు చేపట్టాలని నిర్ణయించాం.. రీజినల్ రింగు రోడ్డుతో (ఆర్ఆర్ఆర్)రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తారాస్థాయికి చేరుతుంది.. సాధ్యమైనంత త్వరగా దీనిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే వినోద జోన్లు, రవాణా హబ్లు, ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి. వచ్చేనెల తొలివారంలో ఎన్హెచ్ఏఐ అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈలోగా జాతీయ రహదారులకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలి’’ అని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేషనల్ హైవేల నిర్మాణానికి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదన్నారు. ప్రభుత్వ పరంగా ఇకపై ఎలాంటి అలసత్వం ఉండరాదని, మన్నెగూడ హైవే నిర్మాణంలో జాప్యం సబబుకాదని మంత్రి పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు 930 వృక్షాలను రీ-లొకేట్ చేసేందుకు అవసరమైన అనుమతులను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని సూచించారు. ‘‘ఆర్మూర్-మంచిర్యాల హైవే భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి.. ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత కాంట్రాక్టర్ను తొలగించి, కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు కేంద్రం అనుమతించింది.. ఎల్బీనగర్-మల్కాపూర్ మార్గంలో మన్నెగూడ వద్ద ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.