![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 09:08 PM
భార్యాభర్తల విడాకుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కలిసిమెలిసి ఉండాల్సిన భార్యభర్తలు.. ఒకరి ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రాంలను మరొకరు వాడొద్దని చెప్పటం క్రూరత్వానికి సమానమైనదేనని.. ధర్మానసం అభిప్రాయపడింది. విడాకుల కేసును విచారించిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్.. ఆ జంట వివాహబంధాన్ని తిరిగి నిర్మించలేకుండా ఉందని.. అభిప్రాయపడింది. భార్యభర్తలు కలిసి ఉండటం అనేది వారి మనసుల కలయికపై ఆధారపడి ఉంటుందని.. జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని ధర్మానసం వెల్లడించింది. చివరికి ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జంట.. డిసెంబర్ 1, 2010న హిందూ ఆచారాల ప్రకారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే.. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం వాడకం, గోప్యత విషయంలో ఇద్దరి మధ్య డిసెంబర్ 4, 2010 నుంచే అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. రోజులు గడిచే కొద్ది గొడవలు కాస్త ఎక్కువవుతుండటంతో.. నవంబర్ 1, 2011 నుంచి ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే.. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా.. సెప్టెంబర్ 13, 2011న ఒక బిడ్డ జన్మించింది. అయినప్పటికీ.. ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంది.
ఇదిలా ఉంటే.. తన భర్తపై జూలై 11, 2012న పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. కాగా.. అతని కుటుంబం ఆగస్టు 25, 2012న ముందస్తు బెయిల్ పొందింది. పదే పదే తనపై కేసులు పెట్టటం, తనతో సరిగ్గా ఉండకపోవటంతో.. విసిగిపోయిన భర్త.. 2012లో విడాకులు అప్లై చేశారు. దీంతో.. ఆ భార్య IPC సెక్షన్ 498-A కింద ఆరోపణలతో సహా భర్తపై 5 క్రిమినల్ కేసులు పెట్టింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. పెద్దమనుషుల్లో తేల్చుకోవాలని అవకాశం ఇచ్చారు. దీంతో.. కొంతమంది కుటుంబ పెద్దలు రాజీ చేయడంతో మే 2015 నుంచి కొంతకాలం కలిసి జీవించారు. తరువాత కూడా ఆ భార్య మళ్లీ భర్తపై కేసులు పెట్టటం ప్రారంభించింది.
కాగా.. భర్త వేసిన విడాకుల పిటిషన్ను నవంబర్ 20 21లో ట్రయల్ కోర్టు కొట్టేసింది. తన భార్య పదే పదే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు శారీరకంగానూ, మానసికంగానూ క్రూరంగా ఉందని వాదిస్తూ భర్త తిరిగి హైకోర్టును ఆశ్రయించాడు. 2011లోనే ఆమె తనను విడిచిపెట్టిందని.. 2015లో కొంతకాలం మాత్రమే తిరిగి వచ్చిందని ఆ భర్త న్యాయస్థానానికి వివరించాడు.
ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు.. 2011 నుంచి సుదీర్ఘకాలం విడిపోవడంతో వీరి వివాహబంధం కోలుకోలేని విధంగా విచ్చిన్నమైందని కోర్టు అభిప్రాయపడింది. వివాహం అనేది.. ఒకరికొకరు ప్రమాణాలు చేసుకునే ఒక వేడుక అని.. కలిసి మెలిసి ఉండాల్సిన భార్యభర్తల్లో ఒకరి ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రాంను మరొకరు వాడొద్దనడం క్రూరత్వం లాంటిదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయ పడింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు.. వీరి వివాహబంధం తిరిగి నిర్మించలేకుండా ఉందని.. భార్యభర్తలుగా రాజీపడి కలిసి జీవించమని కోర్టు బలవంతం చేయదంటూ.. విడాకులు మంజూరు చేసింది.