![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 08:34 PM
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. ఇటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు బలమైన ఈదురుగాలులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెంటీ మీటర్లు.. నిజామాబాద్ జిల్లా పొతంగల్లో 4.8 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ 4.8, బాసర 4.3, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి 3.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి.