![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 07:55 PM
దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే.. ఈ కేసులో సుమారు 100 రోజులకుపైగానే జైలులో ఉంటున్న కవితకు బెయిల్ రావటం కష్టంగా మారింది. ఇప్పటికే.. కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా.. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది.
ఈడీ, సీబీఐ కేసుల్లో అయిస్టయిన కవితకు.. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. వాయిదాలు వేస్తూ వస్తోంది. కాగా.. ఈరోజు తీర్పు వెల్లడించిన హైకోర్టు.. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో.. ఆమెకు బెయిల్ రావటం మరింత క్లిష్టంగా మారింది.
రిమాండ్ పొడిగింపు..
మరోవైపు.. కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కవిత కస్టడీ జూన్ 21వ తేదీతో ముగియగా.. ఈడీ అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు.
అసలు ఏం జరిగిందంటే..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తీహాల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకుని పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారంటూ కవితపై తీవ్ర ఆరోపణలు రాగా.. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో కవిత పాత్రే కీలకమని.. ఇందులో ఆమె 100 కోట్లు అక్రమంగా సంపాధించారంటూ ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపించారు.