by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:42 PM
ఏపీలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో.. జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు ఏపీలోనే కాదు.. ఇటు తెలంగాణలోనూ ఈ విజయం తాలూకు ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలోనూ తమ పార్టీ బలోపేతానికి జనసైనికులు కృషి చేస్తున్నారు. తెలంగాణలోని పలు సమస్యలపై జనసేన తరపున పోరాటం చేయటమే కాకుండా.. రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని జనసైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేపు (జూన్ 29న) కొండగట్టులో పర్యటించనున్న నేపథ్యంలో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ ఛైర్మన్ ఆర్కే సాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాగర్.
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనసేనాని పవన్ కళ్యాణ్.. రేపు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ జనసేన నేతలు వివరించారు. రేపు ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ బయలుదేరుతారని వివరించారు. రోడ్డు మార్గం ద్వారానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్తారని ఆర్కే సాగర్ తెలిపారు. పవన్ అభిమానులు, కార్యాకర్తలు పోలీసులకు అందరు సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సమస్యలపై జనసేన పోరాటం
మరోవైపు.. తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని సాగర్ తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని.. ఏపీలో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు.
జనసేనలో చేరేందుకు నేతల ఉత్సాహం
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా.. ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరతామని తమను సంప్రదిస్తున్నారని నాయకులు తెలిపాపు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ను కోరతామని సాగర్ చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. జనసేనలో పనిచేయటానికి యువత ఉత్సాహంగా ఉన్నారన్నారు. తెలంగాణలో జనసేనను క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని సాగర్ స్పష్టం చేశారు.