by Suryaa Desk | Sat, Jun 29, 2024, 07:31 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డీఎస్.. హైదరాబాద్లోని నివాసంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా.. ఆయన చివరి కోరికను కాంగ్రెస్ నేతలు నెరవేర్చారు. గుండె పోటుతో మరణించిన డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి.. నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్.. పార్టీ సంప్రద్రాయం ప్రకారం డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండాను కప్పి నివాళులు అర్పించారు.
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించిన డీఎస్.. తాను చనిపోతే తన పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని.. తన సన్నిహితులతో చాలా సార్లు చెప్పేవారు. ఆ మాటను గుర్తుపెట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఈరోజు డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి గౌరవించడంతో.. ఆయన చివరి కోరిక తీరినట్టయింది.
అయితే.. 2015 జులై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన డీఎస్.. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత.. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఓసారి.. గాంధీ భవన్కు వెళ్లగా.. ఆయన మళ్లీ కాంగ్రెస్లో చేరారన్న వార్తలు వచ్చాయి. కానీ తాను ఏ పార్టీలో చేరలేదని.. రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే వాటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోని టీపీసీసీ నేతలు.. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని.. కాంగ్రెస్ జెండా కప్పి గౌరవించారు.
మరోవైపు.. హైదరాబాద్ నుంచి డీఎస్ భౌతికాయాన్ని నిజామాబాద్కు తరలిస్తున్నారు. ఆయన స్వస్థలంలో అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తండ్రిపై ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ ట్వీట్
తన తండ్రి మరణం పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. "అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. ఐ విల్ మిస్ యూ డాడీ.. నా తండ్రి నా గురువు అన్ని మా నాన్నే.. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే.." అంటూ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.